ఆసియా కప్లో భారత్ చేతిలో ఓడిపోయిన పాకిస్థాన్.. కనీసం టీమిండియా ప్లేయర్లు తమకి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకపోవడంతో అవమానభారంతో మండిపోతోంది. ఆ కోపాన్ని మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్పై చూపిస్తూ.. యూఏఈతో మ్యాచ్ను బహిష్కరించబోయింది.
వాస్తవానికి బుధవారం యూఏఈతో పాక్ మ్యాచ్ 6.30కి మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉండగా.. 4.30కి ఇరు జట్ల ఆటగాళ్లు స్టేడియంలో ఉండాలి. యూఏఈ జట్టు సమయానికే వచ్చింది కానీ.. గంట తర్వాత కూడా పాక్ ఆటగాళ్లు అక్కడ లేరు. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఆఖరికి రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ క్షమాపణలు చెప్పినట్లు కొత్త డ్రామాకి తెరదీసిన పాక్ ఆటగాళ్లు.. సాయంత్రం 5.45కు ఆటగాళ్లు హోటల్ నుంచి స్టేడియానికి బయల్దేరారు.
ఈ నేపథ్యంలో పాక్-యూఏఈ మ్యాచ్ నిర్ణీత సమయం కంటే గంట ఆలస్యంగా మొదలైంది. అయితే తమ కెప్టెన్, మేనేజర్లకు పైక్రాఫ్ట్ క్షమాపణ చెప్పినట్లు పీసీబీ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. యూఏఈతో మ్యాచ్ను బహిష్కరించి ఉంటే.. పాకిస్థాన్ చిక్కుల్లో పడేది.