Current Date: 04 Jul, 2024

జిమ్‌లో కసరత్తులు చేస్తూ యువకుడి మృతి . వారణాసిలో ఘటన

జిమ్‌లో వ్యాయామం చేస్తూ ఓ యువకుడు కుప్పకూలాడు. తలపోటుగా ఉందని చెప్పడంతో అక్కడున్న వారు సపర్యలు చేస్తుండగానే స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆ యువకుడు చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో చోటుచేసుకుందీ విషాదం. 
నగరానికి చెందిన దీపక్‌ గుప్తా (32) రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తుండేవాడు. పదేళ్లుగా క్రమం తప్పకుండా జిమ్‌కు వెళుతుండేవాడు. ఆరోగ్యంపై స్పృహ ఎక్కువ.. సిటీతో పాటు చుట్టుపక్కల జరిగే ఫిట్‌నెస్‌ కాంపిటీషన్లలో చురుగ్గా పాల్గొనేవాడు. రోజూలాగే గురువారం ఉదయం కూడా జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేస్తుండగా తీవ్రమైన తలపోటుతో బాధపడ్డాడు. తలపట్టుకుని కూర్చున్న కాసేపటికి కుప్పకూలాడు. నేలమీద పడ్డ దీపక్‌ను అక్కడున్న వారు లేపి కూర్చోబెట్టారు. నీళ్లు తాగిస్తుండగా దీపక్‌ నిలువెళ్లా వణికిపోతుండడం గమనించినట్లు చెప్పారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. దీపక్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన ప్రాణం పోయిందని తెలిపారు. జిమ్‌లోని సీసీటీవీ కెమెరాలో ఈ ఘటన మొత్తం రికార్డు కాగా.. ప్రస్తుతం ఆ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.