Current Date: 02 Jul, 2024

వదిన గొంతు కోసిన మరిది.. అక్రమ సంబంధం తెచ్చిన తంట

వదిన గొంతు కోసి చంపి... అనంతరం మరిది కూడా గొంతు కొసుకొని చావు బతుకుల మధ్య ఉన్న ఘటన కృష్ణా జిల్లా పటమట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... పద్మజా నగర్‌కు చెందిన బంగారు దుర్గ(36) ఆరేళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహమైంది. కుమారుడు దుస్తుల దుకాణంలో పని చేస్తున్నారు. చిన్న కుమార్తె చదువుతోంది.

దుర్గ రైతు బజారు సమీపంలోని ఇండోర్‌ స్టేడియంలో స్వీపర్‌గా పని చేస్తోంది. ఆమె తన చెల్లెలి భర్త బి.హరికృష్ణతో సన్నిహితంగా మెలిగేది. ఎన్‌ఏసీ కల్యాణ మండపం సమీపంలో ఉంటున్న హరికృష్ణ కూడా నాలుగేళ్లుగా తన భార్యకు దూరంగా ఉంటున్నాడు. వారికి ఇద్దరు సంతానం. కుమారుడిని హాస్టల్లో ఉంచి, కుమార్తెను తనతో పాటు ఉంచుకొని చదివిస్తున్నాడు. హరికృష్ణ స్వీపర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. హరితో దుర్గ సన్నిహితంగా మెలుగుతోందని ఆమె కుమారుడు అతనిపై దాడి చేశాడు.

దుర్గ కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయంపై తరచూ గొడవ పడటంతో కొంతకాలం నుంచి ఆమె హరిని దూరం పెట్టింది. దాంతో దుర్గపై అతను ద్వేషం పెంచుకున్నాడు. మధ్యాహ్నం పద్మజా నగర్‌లోని ఆమె ఇంటికి  వెళ్లాడు. కొంత సేపటికి గొంతు కోసుకొని తీవ్ర రక్త స్రావంతో ఇంటి నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద పడిపోయాడు. గమనించిన స్థానికులు లోపలికి వెళ్లి చూడగా.. దుర్గ గొంతు కూడా కోసేయగా రక్తం మడుగులో పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే దుర్గ మృతి చెందినట్లు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన హరికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.