Current Date: 04 Jul, 2024

BBC newsroom close in India.. the reason!

భారతదేశంలో తన న్యూస్ రూమ్‌ను మూసివేస్తూ బీబీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. గత ఏడాది కాలంగా ఆదాయపు పన్ను శాఖ నిరంతర దాడులు చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. బీబీసీ ప్రచురణ లైసెన్స్‌ను భారతీయ ఉద్యోగులు ఏర్పాటు చేసిన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి బదిలీ చేసినట్లు బీబీసీ ప్రకటించింది.

న్యూస్ రూమ్‌ ప్లేస్‌లో ఉద్యోగులతో కలెక్టివ్ న్యూస్ రూం పేరుతో దేశంలో ప్రసారాలు ప్రారంభించనున్నట్లు సమాచారం. పబ్లిషింగ్ లైసెన్స్‌ను మరో సంస్థకు అప్పగించడం బీబీసీ చరిత్రలో ఇదే తొలిసారి అని పేర్కొంది. అయినప్పటికీ జర్నలిజంలో రాజీపడబోమని బీబీసీ స్పష్టం చేసింది.

2002 గుజరాత్ మారణహోమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్రను బట్టబయలు చేసిన ‘ఇండియా: ది మోడీ క్వశ్చన్’ అనే డాక్యుమెంటరీ ప్రసారమైన తర్వాత  ఢిల్లీ, ముంబైలలోని బీబీసీ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఆపై ఉల్లంఘనను గుర్తించి నోటీసు జారీ చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో బీబీసీ 2002 గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీని ప్రసారం చేసింది, అయితే కేంద్ర ప్రభుత్వం ఆ డాక్యుమెంటరీ ప్రసారాన్ని నిషేధించింది. గుజరాత్ అల్లర్లలో నరేంద్ర మోడీ పాత్రను నిక్కచ్చిగా వివరించిన డాక్యుమెంటరీ చాలా చర్చనీయాంశమైంది. బీబీసీ మే, 1940లో భారతదేశంలో ప్రసారాన్ని ప్రారంభించింది. హిందీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, తమిళం మరియు తెలుగు భాషలలో బీబీసీ ఇండియా పనిచేస్తోంది.