Current Date: 04 Jul, 2024

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు పడ్డాయోచ్..

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు పడిన బాధలు అంతా ఇంతా కాదు. ఒకటో తారీఖున జీతాలు పడక ఉద్యోగులు ఎన్నో అవస్థలు పడ్డారు. అసలు నెలలో జీతాలు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితులు ఎదురయ్యారు. జీతాల కోసం ఉద్యోగులు, పెన్షన్‌ కోసం పెన్షన్‌దారులు ఎంత ఎదురు చూశారో తెలిసిందే. మరో 12 రోజుల్లో ఎన్నికలనగా అనూహ్యంగా ఈ నెల మాత్రం జీతాల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆశ్చర్యపోయేలా గవర్నమెంట్ వ్యవహరించింది.   గత నాలుగున్నరేళ్ల నుంచి ఒకటవ తేదీన జీతాలు, పెన్షన్లు పడిన దాఖలాలు లేవు. అయితే ప్రభుత్వ ఉద్యోగులను ఆశ్చర్యపరుస్తూ ఏపీ ప్రభుత్వం మే 1న అంటే ఈరోజే జీతాలు, పెన్షన్లు వేసేసింది. పోలింగ్ తేదీ మే13న కావడంతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. మే ఒకటవ తేదీన బ్యాంకులకు సెలవు అయినప్పటికీ ఉదయం 10 గంటలకు ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్లు అకౌంట్లలో జమ అయ్యాయి. వైసీపీపై ఉద్యోగులు, పెన్షనర్లు గుర్రుగా ఉన్నారని ఒకటవ తేదీన వేతనాలు, పెన్షన్లతో గాలం వేసే ప్రయత్నం చేస్తున్నట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఒకటవ తేదీన వేతనాలు వేశారని వాట్సప్ గ్రూపుల్లో సెటైర్లు స్ప్రెడ్ అవుతున్నాయి. మోడల్ కోడ్ అమలులో ఉండటం వలనే జీతాలు వేశారని ఉద్యోగులు చెబుతున్నారు. ఎన్నికలు ఉన్నాయని... అందుకే జీతాలు అంటూ ఉద్యోగుల వాట్సప్ గ్రూపుల్లో మెసేజ్‌లు హల్‌చల్ చేస్తున్నారు. ఏది ఏమైనా నాలుగున్నరేళ్ల తర్వాత సరిగ్గా ఒకటో తారీఖున జీతాలు, పెన్షన్లు పడటడంతో అటు ఉద్యోగులు, ఇటు పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.