Current Date: 05 Oct, 2024

కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ ఇవ్వలేం: సుప్రీంకోర్టు

 మద్యం విధానానికి సంబంధించిన కేసుల్లో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇప్పట్లో జైలు నుంచి విడుదలయ్యేలా కన్పించట్లేదు. ఈ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో ఆయన మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐకి నోటీసులు జారీ చేసింది. మద్యం విధానానికి సంబంధించి జూన్‌ చివర్లో కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆయన సీబీఐ జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఈ అరెస్టును సవాల్‌ చేస్తూ తొలుత దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ ఊరట లభించలేదు. అరెస్టు చట్టబద్ధమేనంటూ ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. దీన్ని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. ఈ కేసులో సీఎంకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. అనంతరం సీబీఐకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఆగస్టు 23వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు ఈడీ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టు ఆయనకు జులై 12న మధ్యంతర బెయిల్‌ మంజూరుచేసిన సంగతి తెలిసిందే. 

Share