Current Date: 02 Jul, 2024

ఒకటే వీధి.... తండ్రిది ఆంధ్రా.. కొడుకుది తెలంగాణా

భద్రాచలం, న్యూస్‌లీడర్‌, మే 5 : ఒకే ఊరు రెండు వేర్వేరు జిల్లాల పరిధిలో ఉండడం, లేదంటే రెండు రాష్ట్రాల పరిధిలో ఉండడం మనకు తెలుసు. కానీ, భద్రాచలంలోని ఓ వీధి ఒకవైపు తెలంగాణ పరిధిలోకి వస్తే, మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోకి వస్తోంది. తండ్రీ కొడుకులు నిర్మించుకున్న ఇళ్లలో ఒకటి తెలంగాణా పరిధిలోకి వస్తే, మరోటి ఆంధ్రప్రదేశ్‌లోకి చేరింది. లోక్‌సభ ఎన్నికల వేళ ఇది ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడిగా ఉండగా ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్‌ ఇల్లు కట్టుకున్నాడు. ఆ తర్వాత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాగా విడిపోయింది. రాజుపేటలోని ఓ వీధి ఓవైపు తెలంగాణాలోని మహహబూబాబాద్‌ లోక్‌సభ పరిధిలోకి వస్తే, మరోవైపు ఉన్న ప్రాంతం ఏపీలోని అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు లోక్‌సభ పరిధిలోకి వెళ్లాయి.
ఈ క్రమంలో శ్రీనివాస్‌ ఇల్లు అరకు లోక్‌సభ స్థానం, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి చేరింది. అదే వీధిలో తండ్రి ఇంటికి ఎదురుగా రోడ్డుకు అవతలి వైపున ఇల్లు కట్టుకున్న శ్రీనివాస్‌ కుమారుడు జానకీరామ్‌ తెలంగాణాలోని మహబూబాబాద్‌ లోక్‌సభ పరిధిలోకి వెళ్లిపోయాడు.