Current Date: 26 May, 2026

బండ్ల గణేష్‌కు చేదు అనుభవం.. చెప్పుతో కొట్టిన పెద్దమనిషి

టాలీవుడ్‌లో కమెడియన్‌గా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేశ్, ఇటీవల నటుడు రాజా రవీంద్ర పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన జీవితాన్ని మలుపు తిప్పిన ఒక చేదు అనుభవాన్ని పంచుకున్నారు. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి, ఇటీవలే చిరంజీవి-బాబీ చిత్రంతో రీఎంట్రీ ప్రకటించిన ఆయన, గతంలో పరిశ్రమకు చెందిన ఒక పెద్దమనిషి తనను ఎంతగా అవమానించారో గుర్తుచేసుకున్నారు. నటి సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన రోజున షూటింగ్ సెట్‌లో జరిగిన ఈ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. సెట్‌లో తాను తోటి నటుడితో మాట్లాడుతుండగా, ఒక పెద్దమనిషి సడన్‌గా తనపై కోపంతో చెప్పుతో కొట్టారని బండ్ల గణేశ్ వెల్లడించారు. ఆ తర్వాత రెండు రోజులకు ఆయన క్షమాపణలు చెబుతూ, వేరే టెన్షన్‌లో ఉండి ఆ కోపాన్ని నీపై చూపించానని సర్దిచెప్పుకున్నప్పటికీ, తాను బలహీనుడిని కాబట్టే ఆ అవమానాన్ని భరించాల్సి వచ్చిందని గణేశ్ ఆవేదన చెందారు. నాటి ఘటనతో తీవ్రంగా గాయపడిన ఆయన, ఆ క్షణమే ఆ సెట్ నుండి బయటకు వచ్చేసినట్లు తెలిపారు. తన వద్ద డబ్బు, పరపతి లేకపోవడం వల్లే అంతటి ఘోర అవమానం జరిగిందని గ్రహించిన బండ్ల గణేశ్, ఆ రోజే ఒక బలమైన సవాల్ విసురుకున్నారు. తనను అవమానించిన వ్యక్తి కంటే ఎక్కువ డబ్బు సంపాదించి, లైఫ్‌లో సక్సెస్ సాధించి చూపిస్తానని తనకు తానే ప్రతిజ్ఞ చేసుకున్నారు. ఆ కసి, పట్టుదలే తనను తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో కోట్లు కూడబెట్టిన సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా నిలబెట్టాయని, ఆ అవమానమే తన జీవితానికి వరంగా మారిందని ఆయన స్పష్టం చేశారు.